వేములవాడ: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతీ ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. వివిధ విభాగాలు, పలు రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్, విచారణలో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పోలీస్శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరిస్తూ, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, పేకాట మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
నేడు వేములవాడకు మంత్రి రాక
వేములవాడ: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం రాత్రి వేములవాడకు చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న వేములవాడ భీమన్న ఆలయంలో జరిగే వరుణయాగంలో పాల్గొంటారని, అనంతరం రూ.1.65 కోట్లతో వేములవాడ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈనెల 30,31, ఆగస్టు 1న మూడు రోజులపాటు వరుణయాగాలు నిర్వహిస్తున్న క్రమంలో గర్భగుడి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు.


