వేములవాడఅర్బన్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా కూరగాయలు సాగు చేసి మంచి ఆదాయం పొందాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కాలానికి అనుగుణంగా తీరొక్క కూరగాయలు సాగు చేస్తున్న వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన రైతు చెరుకు తిరుపతి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించారు. వర్షాలు లేనందున తనకున్న ఐదెకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేస్తానని, 30 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తున్నట్లు కలెక్టర్కు రైతు తెలిపాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తిరుపతి కూరగాయలు సాగు చేయడాన్ని చూసి కలెక్టర్ అభినందించారు. మిగతా రైతులు కూడా ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. ఉద్యానవన, ఇతర శాఖల నుంచి వచ్చే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకముందు మారుపాక రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు ఆదర్శ రైతులను సన్మానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, మార్కెట్ డిమాండ్, నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్ పాల్గొన్నారు.


