● టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
తంగళ్లపల్లి: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అనంతరం బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్ తదితరులను పరామర్శించారు. తాను కేవలం పరామర్శించి వెళ్లేందుకు రాలేదని, నేరెళ్ల ఘటన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పార్టీ నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని నమ్మబలికి ఓట్లు దండుకున్నారని, ప్రభుత్వంలోకి వచ్చాక వారిని మరిచారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా బాధితులకు న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతకముందు కవిత కాన్వాయ్కి జిల్లా శివారులోని జిల్లెల్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లెల్లలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సుమలత సుధాకర్ శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ మజీద్, మండల ఇన్చార్జి చెరుకుపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.


