సిరిసిల్ల–సిద్దిపేట జిల్లా కేంద్రాల మధ్య మూలమలుపులను నివారించేందుకు నిర్మించనున్న జాతీయ రహదారి 365–బీ రోడ్డు పనులు సర్వేస్థాయిలోనే ఆగిపోయాయి. సూర్యాపేట–కోరుట్ల మధ్య జనగామ, చేర్యాల, దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సూర్యాపేట నుంచి దుద్దెడ వరకు ఫోర్లేన్ పనులు ముగింపు దశకు చేరాయి. కొత్తగా సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు 54 కిలోమీటర్ల ఫోర్లేన్ నిర్మాణానికి డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) సిద్ధమవుతోంది. ఈ రోడ్డుతో సూర్యాపేట వద్ద ఉన్న హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి–65తో కోరుట్ల వద్ద ఉన్న జగదల్పూర్(ఛత్తీస్గఢ్) జాతీయ రహదారి–63తో అనుసంధానమవుతుంది. ఈ లక్ష్యంతో కొత్తగా సూర్యాపేట–కోరుట్ల మధ్య 249 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రతిపాదించారు. సర్వేలు సైతం పూర్తయ్యాయి.


