● ఎంఈవోలు ప్రతీ స్కూల్ను తనిఖీ చేయాలి ● రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ)పై డీఈవో మొండయ్య, కో–ఆర్డినేటర్లతో కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. పీజీఐలో భాగంగా జిల్లాకు వివిధ అంశాల్లో వచ్చిన గ్రేడింగ్, పా యింట్స్పై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్లలో ప్రతిభ చూపేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా విద్యాధికారి తమ పరిధిలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు షెడ్యూల్డ్ ప్రకారం అన్ని విద్యాలయాల్లో తనిఖీ చేసి.. ఆ వివరాలు నమోదు చేయాలన్నారు. టీచర్ల ట్రైనింగ్ వివరాలు, అన్ని విద్యాలయాల్లో కంప్యూటర్లు, ట్యాబ్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఐఎఫ్బీ ప్యానెల్స్, టాయిలెట్స్, తరగతి గదులు, మైదానం, ఇతర సదుపాయాల పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఎల్నినో ప్రభావంపై..
జిల్లాలో ఎల్నినో ప్రభావంపై రైతులకు గ్రామ సభల్లో అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షపాతం లోటు, భూగర్భజలాల తగ్గుదల, రిజర్వాయర్లలో వర్షం నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రత్యేకాధికారులు గ్రామసభల్లో పాల్గొనాలి
మండల ప్రత్యేకాధికారి వారానికి కనీసం రెండు గ్రామసభలకు హాజరై రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో స మన్వయం చేసుకుంటూ ఆరుతడి, ప్రత్యామ్నా య పంటలపై అవగాహన కల్పించాలన్నారు. జలసిరిలో రూపొందించిన యాక్షన్ప్లాన్ అమలు చేయాలన్నారు. ఫామ్పాండ్స్, బోర్వెల్ రీచార్జ్, నీటి సంరక్షణ పనులను పెద్ద సంఖ్యలో గ్రౌండింగ్ చేసి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించాలన్నారు. జలసిరి పనులకు సంబంధించి నూతన ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్ బేగం పాల్గొన్నారు.


