● డెడ్ స్టోరేజీలో ప్రాజెక్టులు ● సాగునీరు ఇవ్వలేమంటున్న అధికారులు ● వానాకాలం సాగు లేనట్టే ● వేములవాడలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు
జిల్లాలో ఏకై న భారీ ప్రాజెక్టు మధ్యమానేరు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 27.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశ యం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. ఇందులోకి ఎస్సారెస్పీ వరదకాల్వతో గ్రావి టీ ద్వారా నీరు చేరే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసినా మానేరువాగు పొంగితే నీరు చేరుతుంది. కాళేశ్వరం పంపులు ప్రారంభించకపోవడంతో మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తామని అధికారులు ప్రకటించారు.
ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించిన అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. నీరు లేక ఎగువ ప్రాంతాలకు పంపింగ్ అసాధ్యమవుతుంది. అన్నపూర్ణ జలాశయానికి ప్రధాన ఆధారం మధ్యమానేరు కావడంతో అక్కడ తగినంత నీరు లేక అన్నపూర్ణ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా.. తగినంత నీరు నిల్వ లేక.. అధికారులు చేతులెత్తెశారు.
సిరిసిల్ల: మెట్టప్రాంత రైతుల వానాకాలం సాగు ఆశలు ఆవిరయ్యాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురువకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న జిల్లాలో ఈ వర్షాకాలంలో 11 రోజులు మాత్రమే చిరుజల్లులు కురిశాయి. ఫలితంగా వర్షాకాలం పంటలకు నీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని జలాశయాలు.. సాగునీటి వనరుల తాజా పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్.


