బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లలో ధర్నా.. రాహుల్గాంధీ దిష్టిబొమ్మ దహనం
సిరిసిల్లటౌన్: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు దిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణను గాలికొదిలేసిన ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారన్నారు. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను వదిలేసిన రాహుల్గాంధీ రోడ్డుపై రాజకీయాలు చేశారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి దేశంలో అశాంతి, విధ్వంసకర పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో విద్యార్థులకు జాబ్మేళాలు, స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు.
పోలీస్ వర్సెస్ బీజేపీ
బీజేపీ నాయకులు అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించిన అనంతరం ఏఐసీసీ నాయకుడు రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి రెండుసార్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల దృష్టి మళ్లించి రాహుల్గాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్నాయక్, ధార్మిక ప్రకోష్ట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


