కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండితే.. వేములవాడ మూలవాగు పారుతుంది. రుద్రంగి మండల రైతులకు భూగర్భ జలాలు పెరుగుతాయి. 2,500 ఎకరాల ఆయకట్టు ఉన్న మూలవాగు నీరు లేక వెలవెలబోతోంది. నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం అటవీ ప్రాంతాల్లో వర్షాలు పడితే మూలవాగు నిండుతుంది. వర్షాధారం తప్ప మరో ఆధారం మూలవాగుకు లేదు.
చిన్నబోతున్న చిన్ననీటి వనరులు
జిల్లాలో 656 చిన్ననీటి వనరులు(చెరువులు) ఉండగా.. ఒక్క చెరువులోనూ చుక్కనీరు చేరలేదు. ఈ వానాకాలంలో బలమైన వర్షాలు ఒక్కటి పడలేదు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. బోర్లలో నీరున్న రైతులు నార్లు పోసి నాట్లు వేస్తుండగా.. బావులపై ఆధారపడిన రైతులు క్రేన్ల సాయంతో పూడిక తీస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. వేములవాడ అర్బన్ మండలంలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు నీరిచ్చిన బోర్లు ఎత్తిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో రైతుల ఖరీఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి.


