చెలిమి కార్యక్రమాలు ఇలా..
భయం, బిడియం పోగొట్టేందుకు చెలిమి
విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం
ఆట, పాటలతో మనోధైర్యం
13 కేజీబీవీల్లో 45 రోజుల ప్రోగ్రాం
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పటి వరకు సొంతూరిలో తెలిసిన వారి మధ్య.. తల్లిదండ్రుల సమక్షంలో చ దువుకున్న పిల్లలు.. కొత్త ప్రాంతంలో విభిన్న మనస్తత్వం గల పిల్లల మధ్య చదువడం.. భోజనం చేయడం.. నిద్రించేందుకు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి విద్యార్థినిలకు భయం.. బిడియం పోగొట్టేందుకు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం నింపడం.. అందరితో కలిసేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఉత్సాహంగా..ఉల్లాసంగా..
కస్తూరిబాలో కొత్తగా చేరిన విద్యార్థినులతోపాటు వేసవి సెలవులు ముగిసి విద్యాలయాలకు తిరిగి వచ్చిన వారికి సాధారణంగా ఇంటి మీద బెంగ(హోమ్ సిక్) ఉంటుంది. ఈ సమయంలో వారి మనసు ఇంటి వైపు మళ్లకుండా, చదువుపై ధ్యాస పెట్టేలా అధికారులు ‘చెలిమి’ అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 45 రోజులపాటు రోజుకో అంశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని కోసం టీచర్లను నియమించారు. ఒక్కో విద్యాలయానికి ఒక్కో టీచర్ తరగతుల అనంతరం గంటపాటు ప్రత్యేకంగా సమయం తీసుకుంటారు.
నైపుణ్యం..వ్యక్తిత్వ వికాసం
కొత్తగా చేరిన విద్యార్థులలో టాలెంట్ను ప్రోత్సహించేలా కంప్యూటర్, ఆట, పాటలు, చిత్రలేఖనం, క్రాఫ్ట్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. వారిలోని నైపుణ్యాలను వెలికితీయడంతోపాటు సృజనాత్మకతకు పదును పెట్టేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒంటరితనం పోగొడుతూ అందరితో కలివిడిగా తిరిగేలా, కలిసి భోజనం చేసేలా ఉత్సహ పరుస్తారు. కస్తూర్బా విద్యాలయం తమకు అండగా ఉందనే భరోసాను విద్యార్థినులలో పెంపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 కస్తూర్భా విద్యాలయాలలో 3,500 మంది బాలికలు చదువుతున్నారు.
వారు వేసిన చిత్రాలతో విద్యార్థినులు
బ్యాడ్జీలతో కొత్తగా చేరిన విద్యార్థినులు
సోమవారం అత్యవసర ఒప్పందాలు
మంగళవారం రండి నాతో కూర్చోండి
బుధవారం నా గుర్తింపు చిహ్నం
గురువారం నేను కొత్తవాడిని ఫర్వాలేదు
శుక్రవారం పుష్పం, దీపం
శనివారం ఈరోజు నృత్యం చేద్దాం


