కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఇసుక రీచ్ నిర్వహణకు రైతులు, గ్రామస్తులు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తవ్వకాలను అడ్డుకున్నారు. మామిడిపల్లి మూలవాగు నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. సుమారు 70కి పైగా ట్రాక్టర్లు ఒక్కసారిగా రావడంతో గ్రామస్తులు, రైతులు అభ్యంతరం తెలిపారు. భూగర్భ జలాలు తగ్గిపోయి తాగు, సాగునీటి సమస్యతో గ్రామస్తులు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఒక ప్రాంతానికి మాత్రమే అనుమతి ఇచ్చినా, మరో ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్రెడ్డి, డీటీ ప్రవీణ్కుమార్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇసుక తవ్వకాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.


