వేములవాడఅర్బన్: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. శుక్రవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కు సమాచారం అందించాలన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వాటితో మంటలు ఆర్పే విధానంపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. వైద్యాధికారి డాక్టర్ తిరుపతి, లీడింగ్ ఫైర్మాన్ కే.వెంకటేశం, దుర్గరాజ్, సాబీర్, శేఖర్, ఉపేందర్, భాస్కర్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: ఫుడ్ పాయిజన్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. జిల్లాసుపత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులతో శుక్రవారం మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు, మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆ దేశించారు. ప్రజలు శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్లఅర్బన్: జిల్లాలో కాంగ్రెస్ను గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని 8,9,10,11,12,24వ వార్డుల్లో పార్టీ వార్డు అధ్యక్షుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. పట్టణంలోని 39 వార్డుల అధ్యక్షుల కోసం పట్టణ అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి శ్రమించే నాయకులు, కార్యకర్తలకే అధ్యక్షులుగా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, అర్హులకు ఫలాలు అందించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, మాజీ వైస్ ఎంపీపీ చల్ల హరికృష్ణ, రాష్ట్ర నాయకులు ఆకునూరి బాలరాజు, యూత్ అధ్యక్షులు దేవరాజ్రెడ్డి, సుంకరి సాయి, ఆడెపు ప్రసాద్, గంగాధర్, రాజేశం, నాగభూషణం, సత్యనారాయణ పాల్గొన్నారు.


