● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లటౌన్: కూరగాయల సాగు పెంచేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కూరగాయల సాగుకు ప్రోత్సాహంపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ నుంచి జిల్లాకు వచ్చిన 1250 విత్తనాల ప్యాకెట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి గోవర్దన్, పీఏసీఎస్ కూరగాయల వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి
గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. మాతా, శిశు మరణాలు, తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు జిల్లాలో జరగకూడదన్నారు. జిల్లా వైద్యాధికారి రజిత, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీఎన్జీ ఏర్పాటుపై సమీక్ష
జిల్లాలో పీఎన్జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) కనెక్షన్ల ఏర్పాటుపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఐవోసీఎల్ అధికారి రాహుల్ సింగ్, పౌర సరఫరాల శాఖ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్యలు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పీఎన్జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) ద్వారా సరఫరా అవుతుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. త్వరలోనే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎన్ జీ ద్వారా సరఫరా చేయనున్నామని అధికారులు వివరించారు.


