రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): ప్రజల అభ్యున్నతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో రైతులు, పార్టీ నాయకులు 37 నెలల పాటు ప్రతినెలా 22న ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు నిర్వహించి నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూభాగానికి నీరు అందించే ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో సూరమ్మను చేర్చి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి మల్యాల గ్రామంలో రూ.1,737 కోట్లతో ప్రాజెక్టు పనులకు అంకురార్పణ చేశారని, రుద్రంగి నాగారం చెరువు వారి హయాంలోని పూర్తయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నిల్వ సామర్థ్యాన్ని 150 ఎంసీఎఫ్టీ నుంచి 450 ఎంసీఎఫ్టీ వరకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా రైతాంగానికి నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, వేములవాడ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


