● ప్రముఖ కవి జూకంటి జగన్నాథం
సిరిసిల్ల: కవులు, రచయితలు సామాజికాంశాలను తీసుకుని కవిత్వీకరించాలని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు. సిరిసిల్లలోని అక్షర చైతన్య గ్రంథాలయంలో శనివారం మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘మానేటి స్వరం’ పేరుతో ‘ప్రపంచ కవితా దినోత్సవం’ నిర్వహించారు. జూకంటి జగన్నాథం మాట్లాడుతూ 1999లో పారిస్లో జరిగి న యునెస్కో 30వ సర్వసభ్య సమావేశంలో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. తన చిన్నతనంలో విన్న పాండవ కథలు, హరికథల గురించి వివరించారు. తనను ప్రభా వితం చేసిన జక్కని వెంకటరాజం, కనపర్తి, నిజాం వెంకటేశంలను గుర్తుకు చేసుకున్నారు. పుస్తకాల అధ్యయనం అవసరమన్నారు. పూలే గులాంగిరి, అంబేడ్కర్ను చదవాలని సూచించారు. ‘పాతాళగరిగే’, ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ లోంచి కవితలను వినిపించారు. మారసం 37 ఏండ్ల ప్రస్థానాన్ని ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్ వివరించారు. మారసం వ్యవస్థాపకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ ప్రపంచ కవితా దినోత్సవం ఆవిర్భావ, వికాసాల గురించి వివరించారు. మారసం కోశాధికారి, కవులు ఎలగొండ రవి, వెంగళ లక్ష్మణ్, అక్షరచైతన్య గ్రంథాలయ స్థాపకులు నాగుల పూర్ణచందర్, రచయిత, జర్నలిస్ట్ అల్లె రమేశ్, కవులు దూడం గణేశ్, గుండెల్లి వంశీకృష్ణ, తాటిపాముల కిరణ్, వేముల మార్కండేయులు పాల్గొన్నారు.


