మల్యాల: మండలంలోని ముత్యంపేట కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం పూజలు చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లతో కలిసి ఆలయానికి చేరుకోగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ అంజారెడ్డి, సర్పంచులు సంకూర్తి తిరుపతి, వకుళాభరణం మౌర్య, బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నాయకులు బొట్ల ప్రసాద్, కొల్లూరి గంగాధర్, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లెటి రమేశ్, గుండేటి గంగారాం, ఆలయ సిబ్బంది హరిహరనాథ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రాయికల్: రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన గిరిజన నాయకుడు గుగ్లావత్ చిరంజీవి (40) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగ్లావత్ చిరంజీవి గ్రామంలోని కుంటలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లాడు. పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు నీటిలో ఉండటంతో గమనించకుండా కుంటలోకి దిగాడు. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చిరంజీవికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిరంజీవి అఖిల భారత బంజార గిరిజన సేవ సంఘ్ మండల అధ్యక్షుడిగా గిరిజనులకు సుపరిచితులు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, గిరిజన నాయకులు సంతాపం ప్రకటించారు.
అనుమానాస్పద స్థితిలో లస్కర్..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ కెనాల్ దగ్గర లస్కర్గా పనిచేస్తున్న చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన తడిగొప్పుల మల్లయ్య (55) శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి మల్ల య్య, అనిల్ కెనాల్పై డ్యూటీ చేశారు. రాత్రి కెనాల్ వద్దే నిద్రించారు. శనివారం ఉదయం అనిల్ నిద్రలేచి చూడగా మల్లయ్య కనిపించలేదు. కొద్దిదూరంలో ఉన్న గూడ తిరుపతి పొలం వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


