ఠాణా ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఠాణా ఎదుట ధర్నా

Mar 22 2026 7:22 AM | Updated on Mar 22 2026 7:22 AM

కూతురుతో మాట్లాడించాలని

ధర్మారం: ప్రేమ పేరుతో ఒక యువకుడు తమ కూతురిని వివాహం చేసుకున్నాడని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదని ధర్మారానికి చెందిన కుంటయ్య కుటుంబ సభ్యులు శనివారం పురుగుల మందు డబ్బా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితులు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన కుంటయ్య కూతురును జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం గొడిసెల పేటకు చెందిన యువకుడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో తన కూతురుతో ఒకసారి మాట్లాడాలని తండ్రి కుంటయ్య, తల్లితోపాటు సోదురుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే యువకుడి తల్లిదండ్రులను పిలిపించి యువతీకువకులను ఠాణాకు తీసుకురావాలని ఆదేశించారు. తర్వాత యువకుడి తల్లిదండ్రులను వారి ఇంటికి పంపించారు. ఆగ్రహానికి గురైన యువతి కుటుంబసభ్యులు.. వారిని ఎందుకు పంపించారని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో యువతీయువకులను ఠాణాలకు పిలిపిస్తామని చెప్పి కుంటయ్య కుటుంబసభ్యులను ఇంటికి పంపించారు. పోలీసులు యువకుడి తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ కుంటయ్య కుటుంబ సభ్యులు పురుగులమందు డబ్బా పట్టుకుని మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అప్రమత్తమైన పోలీసులు.. పురుగులమందు డబ్బా స్వాధీనం చేసుకుని వారిని బయటకు పంపించారు. గ్రామంలోకి వెళ్లిన కుంటయ్య.. మరో పురుగుల మందు డబ్బాతో మళ్లీ ఠాణా వద్దకు చేరుకున్నాడు. డబ్బా మూత తీసి పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు డబ్బాను లాక్కున్నారు. ఆవేదనకు గురైన కుంటయ్య కుటుంబసభ్యులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని యువతి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. అదేసమయంలో ఠాణాకు వచ్చిన ఎస్సై ప్రవీణ్‌కుమార్‌.. కుంటయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెళ్లి చేసుకున్న యువతీయుకులను ఆదివారం రప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుంటయ్య, కుటుంబసభ్యులు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎస్సైని సంప్రదించగా.. వివాహం చేసుకున్న యువతీయువకులిద్దరి సర్టిఫికెట్లు పరిశీలించామని, పుట్టిన తేదీప్రకారం వారు మేజర్లు కావడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. అయినా.. వారిద్దరినీ పిలిపించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని తల్లిదండ్రుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement