సుర్రుమంటున్న ఎండలు
మార్చి రెండోవారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
పనులకు వెళ్లడానికి జంకుతున్న ప్రజలు
మధ్యాహ్నం నిర్మానుష్యంగా రహదారులు
నీడ కల్పించని అధికారులు
సిరిసిల్లటౌన్: నిప్పులకొలిమిలా భానుడు భగభగ మండుతున్నాడు. గత వారం రోజులుగా ఎండలు ముదరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనులపై వచ్చే వారు మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకునేలా చూస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కాపాడుకునేందుకు గొడుగులు, తువ్వాలలను ఆశ్రయిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనానికి శీతల పానీయాలు. కొబ్బరిబొండాలు, చెరుకురసం తాగుతున్నారు. హమాలీ, డైయింగ్, భవన నిర్మాణ కార్మికులకు ఎండల్లో పనిచేయడం ఇబ్బందిగా మారింది. అన్నివేళల్లో సందడిగా ఉండే సిరిసిల్ల పట్టణం దంచికొడుతున్న ఎండలతో మార్కెట్లు మధ్యాహ్నం 12 గంటల వరకే బోసిపోతున్నాయి.
కనిపించని గ్రీన్నెట్స్
ఏటా ఎండాకాలంలో మున్సిపల్ నుంచి ప్రజలకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏడాది మార్చిలోనే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండడాన్ని అధికారులు ఊహించలేదు. భగభగమండుతున్న ఎండలో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండల ఽనుంచి జనాలకు నీడ కల్పించే విషయంలో ఇప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు. పాతబస్టాండులో ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ ప్రయాణికులు బస్సుల కోసం మండుటెండలోనే నిలబడుతున్నారు. పల్లెల నుంచి వచ్చే జనాలు ఎండలతో భేజారవుతున్నారు. ఓపెన్ స్థలాల్లో నీడకల్పించడంలో అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం జనాలకు ఇబ్బందిగా మారింది. ఇక పాతబస్టాండులో ప్రయాణికులకు నిలువ నీడ, తాగడానికి నీరు లేకపోవడం వి మర్శలకు దారితీస్తోంది. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు ప్రయాణాలు చేయడం, రోడ్లపై కి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎండదెబ్బకు గురికాకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దబజారు, కూరగాయల మార్కెట్, అంబేడ్కర్ చౌరస్తా, గాంధీచౌక్, సెస్ ఆఫీస్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, కలెక్టరేట్ చౌరస్తా, విద్యానగర్ చౌరస్తాల్లో గ్రీన్నెట్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది సిరిసిల్లలోని అంబేడ్కర్చౌరస్తా. నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఎప్పుడూ ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. కానీ సోమవారం మధ్యాహ్నం ఇలా నిర్మానుష్యంగా మారింది. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రానికి అన్ని మండలాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సందడి కనిపించలేదు.


