గ్రామాభివృద్ధికి
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉపాధి..హామీ!
కేటాయించిన నిధులు: రూ.349.71 కోట్లు
పక్కా
భవనాలులేని పంచాయతీలు: 81
ఈ ఏడాది
గుర్తించిన పనులు: 315
భవనాల్లేని
అంగన్వాడీ కేంద్రాలు: 140
సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్తగా పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్గా ఎన్నికై నందుకు సంబరంగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం అండగా నిలుస్తోంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకంపేరు మార్చడంతో పాటు పనిదినాలు 100 నుంచి 1,25కు పెంచారు. 266 పనులు అదనంగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిపై సర్పంచులు దృష్టిసారిస్తే గ్రామాభివృద్ధి ఇట్టే సాధ్యం.
ఉపాధి కూలీలు:
1.95 లక్షలు
మరుగుదొడ్లులేని
కుటుంబాలు: 516
జాబ్కార్డులు
ఉన్నవారు: 97 వేలు
పంచాయతీలు:
260
‘దారి’ వేసుకోవచ్చు
గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది.
హరితహారం పెంచాలి
గ్రామాల్లో మొక్కలునాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంటుంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలు నాటడం.. పోషణకూ డబ్బులు ఇస్తున్నారు.
నీటిని నిల్వచేసుకోవచ్చు
సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊటకుంటలు, పాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తిచేస్తే.. భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
స్వచ్ఛ గ్రామాలుగా ముందుకెళ్లొచ్చు
గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు.
సాగు.. బాగు..
గ్రామాల్లో చెరువులు, చెక్డ్యాంలు, ఊటకుంటలు, ప్రాజెక్టు కాల్వల నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే వారికి ఉపాధి చూపడంతో పాటు ఇటు నీటి వనరులు బాగు చేసుకోవచ్చు. సాగునీటి సమస్య లేకుండా చేసుకోవచ్చు.
వీరిని సంప్రదించండి
ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి.


