
‘సీఎమ్మార్’లో వేగం
● రికార్డుస్థాయిలో బియ్యం డెలివరీ ● ముందంజలో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు ● జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో నత్తనడకన సాగిన వైనం
సాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్(సీఎమ్మార్– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో జాప్యం చేస్తూ వచ్చిన రైస్మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్యారెంటీబాండ్లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్ దందాకు చెక్పెట్టినట్లు అయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శాతంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్ నాలుగో స్థానంలో నిలిచాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి.
బ్యాంక్ గ్యారెంటీ షరతు
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభు త్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్ రైస్, 67 కిలోల రా రైస్ ప్రభుత్వానికి అప్పగించాలి. రాష్ట్రంలో అవసరమైన రేషన్బియ్యం కోటా తీసుకొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించాలి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా బియ్యం అప్పగించకుండానే విక్రయించి ఆ డబ్బుతో వ్యాపారాలు చేసుకునేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్మిల్లర్లకు వరంగా మారినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నా యి. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, సివిల్ సప్లయీస్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తుల జప్తునకూ వెనకాడడం లేదు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించిన మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్ డెలివరీ వేగవంతమైంది.
రికార్డు నమోదు
రైస్మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్ను త్వరగా పూర్తిచేయాలి. ప్రస్తుత చర్యలతో గత వానాకాలం సీఎమ్మార్ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండోస్థానంలో ఉంది. – శ్రీకాంత్రెడ్డి, డీఎం,
జిల్లా పౌర సరఫరాలు, పెద్దపల్లి