ఒంగోలు సబర్బన్: రోడ్డు భద్రతా నిబంధనల్లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సీటు బెల్టు ధరించని వాహనదారులపై, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లను గుర్తించి, సంబంధిత వాహనాలను నిలిపివేసి ఆ ఎల్ఈడీ లైట్లను తొలగించారు. మొత్తం 47 వాహనాలకు రూ.65 వేల జరిమానా విధించారు. మోటార్ వాహన తనిఖీ అధికారి రామచంద్రరావు, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు జయప్రకాశ్, ధర్మేంద్ర, భానుప్రకాశ్, జశ్వంత్ పాల్గొన్నారు.
మద్దిపాడు: ఎల్నినో ప్రభావాన్ని తట్టుకుంటూ రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఐటీ శాఖ స్పెషల్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే నువ్వులు, జొన్న, సజ్జలు, రాగులు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులకు వివిధ పంటల్లో వస్తున్న చీడపీడలను గుర్తించడానికి, ఎరువుల పంపిణీ, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేస్తున్న విధానాలను పరీక్షించారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉందన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మద్దిపాడు మండలం, గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు గ్రామాలను పైలెట్ ప్రాజక్టు కింద 5 వేల ఎకరాలు తీసుకుని ఆయా గ్రామాల్లో సాగునీటి వసతి పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ఆదాయం వచ్చే పంటలను వేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు మేలు జరగడమే తన తుది లక్ష్యమన్నారు. మండలంలోని బసవన్నపాలెం, సీతారాంపురం, నేలటూరు, అన్నంగి గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు సరిగా అందడం లేదని రైతులు తెలుపగా, త్వరలోనే ఆయా ప్రాంతాలలో టవర్ నిర్మానం చేపట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు, ఏఓ స్వర్ణలత, రైతులు, వీఏఏలు పాల్గొన్నారు.


