● మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా, జిల్లా చరిత్రలో మధుర స్మృతి గా నిలిచిపోయేలా నిర్వహించాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న తొలి వేడుకల్లో భాగస్వాములు కావడం అధికారులందరికీ అరుదైన అవకాశమన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆహ్వాన పత్రికలను అక్షర దోషాలు లేకుండా రూపొందించి ముందస్తుగా అందజేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించాలన్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతోపాటు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన త్రిపురాంతకం, భైరవకోన, నెమలిగుండం, ఇష్టకామేశ్వరి, చెన్నకేశవ స్వామి ఆలయాల విశిష్టతను చాటేలా శకటాలు ప్రదర్శించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ పులి శ్రీనివాసులు, డీఆర్ఓ వెంకటశివరామిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


