పీసీపల్లి: పాతకక్షలతో ‘మా జోలికి వచ్చేది ఎవడురా’ అంటూ ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేసి, పెద్ద పెద్దగా తిడుతూ అడ్డొచ్చిన వారిని గాయపరిచిన ఘటన ఆదివారం మండల పరిధిలోని పెదఇర్లపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెదఇర్లపాడు ఎస్సీ పాలేనికి చెందిన కొంత మంది ఒక చోట కూర్చుని ఇటీవల గ్రామంలోని వడ్డెపాలెంలో జరిగిన కొలుపులకు సంబంధించి వచ్చిన డబ్బులు పంచుకునే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అద్దంకి సులేమాన్ వారు తన గురించే మాట్లాడుకుంటున్నారంటూ కత్తి పట్టుకుని పెద్ద పెద్దగా తిడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అతనికి అడ్డువచ్చిన అత్యాల శ్యామ్, విలియంకేర్ను శ్ఙ్రీమీరెవరు నాకు చెప్పడానికంటూ’ కత్తితో వారిపై దాడిచేశాడు. దీంతో శ్యామ్కు మూడు చేతివేళ్లు తెగిపోగా, విలియంకేర్ మోచేయికి గాయమైంది. దీంతో గ్రామస్తులు గాయపడిన వారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..మార్గం మధ్యలో వెంగళాయపల్లి గ్రామం వద్ద అద్దంకి సులేమాన్ అన్న అద్దంకి శాంసన్ కారులో వస్తూ ఆటోను ఆపి ‘మా వాడి మీద దాడి చేస్తారా’ అంటూ రెండు పెద్ద రాళ్లను ఆటోకు అడ్డంగా ఉంచి వారిపై దాడిచేయబోయాడు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు అడ్డుకుని శ్యాంసన్ను మందలించి ఆటోను పంపించారు. అనంతరం ఆటోను అనుసరిస్తూ వెనుక బైక్పై వస్తున్న అత్యాల ప్రశాంత్, అరిగెల శాంసన్ను కారుతో గుద్దించడంతో ప్రశాంత్కు ఎడమ కాలు విరగగా, అరిగెల శాంసన్కు ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. దీంతో వెంగళాయపల్లి గ్రామస్తులు అద్దంకి శాంసన్ను గట్టిగా మందలించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కనిగిరి, ఒంగోలుకు తరలించారు. ఈ విషయంపై పీసీపల్లి ఎస్సై నరసింహారావుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరించారు. అద్దంకి శాంసన్, సులేమాన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ముల దాడి


