● ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు
ఒంగోలు సబర్బన్: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని ఏపీఎంఐపీ పీడీ సీహెచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు పాత రిమ్స్లోని డీపీఎంయూ కార్యాలయంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్ ) విధానంలో సీడ్ పెల్లైటెజేషన్ చేసి పప్పుధాన్యాలు, పశుగ్రాస పంటలను విస్తృతంగా సాగు చేయాలని వివరించారు. పీఎండీఎస్ సీడ్ పెల్లైటెజేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. పప్పుధాన్యాలు, పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు అవసరమైన మేత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొవడానికి ఈ విధానం సమర్థవంతమైన పరిష్కారమని సూచించారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎం వి.సుభాషిణి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై అవగాహన కల్పించారు. రైతులు పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చేందుకు ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం సుభాషిణి ఆధ్వర్యంలో డీపీఎంయూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


