పీపీపీ విధానానికి వ్యతిరేకంగా 20 నుంచి రిజిస్ట్రేషన్లు బంద్ సమ్మె బాటలో 1400 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉమ్మడి జిల్లాలో 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
మార్కాపురం: రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 396ను విడుదలజేసింది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు సమ్మెబాట పట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 1400 మందికిపైగా డాక్యుమెంటు రైటర్లు ఈనెల 20 నుంచి పెన్ డౌన్ చేశారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రభుత్వం రూ.5 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అమ్మనబ్రోలు, సింగరాయకొండ, చీమకుర్తి, అద్దంకి, మార్టూరు, కందుకూరు, దర్శి ప్రాంతాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆరు రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దీక్షలు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నెలమొత్తం మీద సగటున మార్కాపురంలో 70, కంభంలో 30, గిద్దలూరులో 30, యర్రగొండపాలెంలో 50, పొదిలిలో 40, కనిగిరిలో 50 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ప్రతిరోజూ ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లా నుంచి రూ.80 లక్షల దాకా ఆదాయం వస్తోంది. ఇలా ఆరు రోజులకు ఇప్పటి వరకూ సుమారు రూ.5 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.
పీపీపీ విధానమంటే ఇదే..
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తామ ని ప్రకటించినట్లుగా కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్పోర్టు కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరూ ప్రభుత్వం ఏర్పా టు చేయబోయే ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు)కి వెళ్లి వారే డాక్యుమెంట్లు తయారుచేసుకుని సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే ఆయన పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ విధానం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకానున్నాయని డాక్యుమెంటు రైటర్లు అంటున్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల్లో ఎవరికై నా రిజిస్ట్రేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోయినా చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్న్రాు. డాక్యుమెంటు రైటర్ల పెన్డౌన్ సమ్మెకు ప్రజా సంఘాలతో పాటు మార్కాపురం, పొదిలిలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు, ఒంగోలులో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు మద్దతు ప్రకటించారు. ఈనెలాఖరు వరకూ డాక్యుమెంటు రైటర్లు సమ్మెలో పాల్గొననున్నారు. అయితే శనివారం ఉదయం నుంచి ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను చేస్తారని ప్రకటించింది. డాక్యు మెంటు రైటర్లు మాత్రం సమ్మెలో పాల్గొంటున్నారు.
జీవో నెం 396ను ఉపసంహరించాలి
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ విధానంలో ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల కుటుంబాల వారు ఉపాధి కోల్పోతారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1400 కుటుంబాల వారు ఈ శాఖపై ఆధారపడి ప్రజలకు డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం మాపొట్టకొట్టొద్దు. మా ఆవేదనను గమనించి జీవోను ఉపసంహరించాలి.
– టి సుబ్బారావు, డాక్యుమెంట్ రైటర్స్ సంఘం అధ్యక్షుడు


