నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
నిరసన వ్యక్తం చేస్తున్న దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
ఒంగోలు వన్టౌన్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మార్పీఎస్ నాయకులు ఖండించారు. ఆ మేరకు గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటిమాదిగ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై ఢిల్లీలో జరిగిన పోలీసుల బలప్రయోగాన్ని ఎమ్మార్పీఎస్ అధినేత ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి కోచింగ్లు తీసుకుని సిద్ధమయ్యే నీట్ పరీక్షల విశ్వసనీయత దెబ్బతినడం అత్యంత ఆందోళనకరమన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పారదర్శకంగా, వేగంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుతం.. నిందితులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనేక సార్లు నీట్ పేపర్ను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, ప్రజాప్రతినిధులపై పోలీసులు బలప్రయోగం చేయడం, టియర్ గ్యాస్ విడుదల చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు ఎమ్మార్పీఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ సంఘ చైర్మన్ కొమ్మూరి గరటయ్య మాదిగ, రేణమాల మాధవ్ మాదిగ, గంధం ఇర్మియా మాదిగ, ప్రత్తిపాటి నాగయ్య మాదిగ, గౌడపేరు మహేష్ మాదిగ, బక్కా రాజు మాదిగ, మల్లెల ప్రసాద్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, రావినూతల కొర్నేలు మాదిగ, బెన్నీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
దళిత హక్కుల పరిరక్షణ సమితి
ఆధ్వర్యంలో...
నీట్ పరీక్షల పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై మోదీ ప్రభుత్వం పోలీసులతో దమనకాండకు పాల్పడటం దారుణమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలు నీలంపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, నీట్ పరీక్షల నిర్వహణపై సమాధానం చెప్పకుండా మోదీ ప్రభుత్వం దాటవేస్తోందన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య మాదిగ, పరిరక్షణ సమితి అధ్యక్షుడు పట్టరా బంగారం, దేవరపల్లి గోపి, గడ్డం వెంకటేశ్వర్లు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.


