● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
జంగాల అజయ్ కుమార్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా సాగుతున్న చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆగస్టు 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతోందని..సాయికృష్ణ అనే యువకుడిని స్వయంగా పోలీసులే కాల్చి చంపి బూడిద మిగిల్చకుండా చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, విద్యా విధ్వంసం జరిగిందన్నారు. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులకు భారాలు అన్నరీతిలో మోదీ పాలన కొనసాగుతోందని చెప్పారు. మోదీ రాక్షస పాలనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంత పాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీచార్జిలు చేసినా చంద్రబాబు నోరు విప్పి మాట్లాడడంలేదని విమర్శించారు. మోదీ రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రజల రక్తాన్ని కళ్ల చూస్తూ ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీలను ఝళిపించడమే కాకుండా టియర్ గ్యాస్తో చెల్లాచెదురు చేయడం దారుణమన్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 22 రోజులుగా ఆమరణ దీక్ష చేసినా మోదీ ప్రభుత్వం కనీస స్పందించకపోవడం విచారకరమని చెప్పారు. సోనం వాంగ్ చుక్ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి దీక్ష భగ్నం చేయడం దేశమంతా చూసిందన్నారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో చేసుకుంటున్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ హర్యానా, పంజాబ్ రైతాంగాన్ని ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్నీ విధాలుగా విఫలమైందని విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు కేవలం ఎస్ఎంఎస్లు, కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. కరెంటు బిల్లులు పెంచమని చెబుతూనే దొడ్డిదారిన పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల కనుసన్నుల్లో అధికారులు పనిచేస్తున్నారని, ప్రజా పరిపాలన కనిపించడంలేదని చెప్పారు. పొగాకు మద్దతు ధర కోరుతూ నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే మోటారు బైకు ప్రచార జాత కార్యక్రమాన్ని కార్యకర్తలు, రైతుల విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.


