ఒంగోలు టౌన్: దేశ వ్యాప్తంగా నీట్ సహా పలు జాతీయ ప్రవేశ పరీక్షల పేపర్లు వరసగా లీకేజీ అవుతున్నందున లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీ జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో బుధవారం ఎల్బీజీ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కులను దెబ్బతీసే విధానాలు ఎంత మాత్రం మంచివి కావని, రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా పరీక్షలు జరగాలని చెప్పారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువజనులపై కేంద్ర ప్రభుత్వం దమనకాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జికి బాధ్యుడైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో విద్యార్థి నాయకులు సీహెచ్ వినోద్, దేవా, నీట్ విద్యార్థులు పాల్గొన్నారు.


