● రూ.4.60 లక్షల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాల దోపిడీ
దర్శి: దర్శి నగర పంచాయతీలోని కొత్తరెడ్డిపాలెంలో తూము శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు వివరాల మేరకు..శనివారం రాత్రి శ్రీనివాసరెడ్డి భవనంపైన నిద్రించాడు. ఆయన భార్య పంచలోని కటకటాల్లో పడుకున్నారు. అయితే ఇంటి వెనుక వైపు ఉన్న పొలాల్లోని ప్రవేశించిన దుండగులు వంటగది తలుపులు గడ్డపారతో పెకిలించి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని సొరుగులో ఉన్న నాలుగు సవర్ల చైను, బీరువాలో ఉన్న రూ.4.60 లక్షల నగదు అపహరించారు. తెల్లవారుజామున నిద్ర లేచిన కుటుంబసభ్యులు వెనుక తలుపులు తీసి ఉంది. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో శ్రీనివాసరెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రామారావు, ఎస్సై మురళీలు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఒంగోలు నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. వాస్తవానికి ఆ బంగారం, నగదు శ్రీనివాసరెడ్డికి చెందినది కాదని తెలుస్తోంది. ఆయన బావమర్దికి చెందిన నగదు బ్యాంక్ నుంచి తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు. ఆ నగదు అపహరణకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
బీరువాలో మరికొన్ని నగలు..
దుండగులు బీరువా పై అరలో ఉన్న రూ.5 లక్షలు అపహరిచారు. అయితే కింద అర మాత్రం దుండగులు కదిలించలేదు. కింద అర తాళాలు తీస్తే అందులో సుమారు 35తులాలు బంగారం, నగదు కలిపి రూ.50 లక్షల వరకు సొత్తు ఉంది.ఆ తాళం తీయకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


