ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా టి.వెంకట కృష్ణయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఫైలుపై సంతకాలు పెట్టి విధుల్లో చేరారు. అనంతరం కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఒంగోలు నగర పరిస్థితులపై కలెక్టర్తో కొంతసేపు చర్చించారు. అనంతరం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నగరంలోని పరిస్థితులపై సమీక్షించారు.
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 48 ఎయిడెడ్ పాఠశాలలకు ఒకే టీచర్ ఉన్నారని, మరో టీచర్ను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఒకే టీచర్తో అన్ని తరగతులకు బోధన జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకే టీచర్ ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు మండలాల వారీగా ఒంగోలు 9, నాగులుప్పలపాడు 5, మద్దిపాడు 2, చీమకుర్తి 1, బేస్తవారిపేట 1, కనిగిరి 2, హనుమంతునిపాడు 2, వెలిగండ్ల 3, కంభం 3, మార్కాపురం 2, గిద్దలూరు 4, కొమరోలు 2, అద్దంకి 1, పర్చూరు 2, యద్దనపూడి 1, ఉలవపాడు 1 చొప్పున ఉన్నాయన్నారు. ఆయా పాఠశాలల్లో ఒకే టీచర్ పనిచేస్తున్నందున విద్యార్థులకు సరైన బోధన జరగక, ఉపాధ్యాయులకు సెలవు మంజూరు కాక అటు యాజమాన్యం, ఇటు మండల విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లాలో మిగులుగా ఉన్న 202 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి విద్యాబోధనకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబును కోరారు.


