ఉపాధి హామీ కూలీల సొమ్మును దోచుకోవడం రెండేళ్లుగా నిత్యకృత్యంగా మారింది. పని చేయకుండానే మస్తర్ వేస్తే ఓ రేటు, పనికి వచ్చినా కూలి ఇచ్చేందుకు మరో రేటును నిర్ణయించి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలివ్వలేదంటే మరుసటి వారం నుంచి ఆ కూలీలను పనులకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా గ్రామంలో ఉండి కూడా పనులకు వెళ్లని వారి పేర్లను మస్తర్లో నమోదు చేస్తున్న ఎఫ్ఏలు.. సదరు కూలీకి వచ్చే సొమ్ములో సగం దిగమింగేస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో పేర్లు నమోదు చేసి నొక్కేస్తున్నా అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారమంతా కష్టపడి పని చేసిన కూలీలు తమకు రావాల్సిన సొమ్ము తీసుకోవడానికి కూడా రూ.100 నుంచి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామంలో వారానికి రూ.600 కూలి దక్కగా అందులో రూ.150 ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేయడంతో వివాదం నడుస్తోంది. ఇదెక్కడి అన్యాయం అంటూ గ్రామంలోని కూలీలు ప్రశ్నిస్తున్నారు.


