న్యూస్రీల్
పాము మెలికల్లా హైటెన్షన్ విద్యుత్ లైను అధికార పార్టీకి చెందిన వారి పొలాలను తప్పించే కుట్ర కందుకూరు నుంచి కరేడుకు ఎన్ని మెలికలో... మామిడి, సపోటా తోటలకు ముప్పు చక్రం తిప్పుతున్న డిస్కం ఏఈ పరిహారం పేరుతో స్వాహా చేసేందుకు రంగం సిద్ధం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
అధికార పార్టీ నాయకుల ప్రాపకం కోసం ట్రాన్స్కో అధికారులు హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాట్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరు నుంచి కరేడు వరకూ నిర్మించతలపెట్టిన 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంలో అధికార పార్టీ నేతలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాముల మెలికల్లా నిర్మిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తీగల బంధం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కందుకూరు నుంచి కరేడు వరకు 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైను నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ లైను వెళ్లే రూటులో అధికార పార్టీకి చెందిన పొలాలు, మామిడి తోటలు, సపోటా తోటలు తగలకుండా పాము మెలికల్లా తిప్పుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 10 మందికి పైగా అధికార టీడీపీకి చెందిన వాళ్ల పొలాల్లో కాకుండా ఇతరుల పొలాల్లోకి వంపులు తిప్పుతున్నారు. దాంతో సంబంధం లేని వాళ్ల మామిడి తోటలు, సపోటా తోటలు మాయం కానున్నాయని రైతులు వాపోతున్నారు.
ఇష్టారాజ్యంగా మార్పులు..
అధికార పార్టీ నేతల ఒత్తిడో..పచ్చనోట్ల ప్రభావమో తెలియదని, ట్రాన్స్ కో అధికారుల అలైన్మెంట్ తప్పుగా మార్చడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ లైన్ నిర్మాణానికి కొద్ది నెలల కిందట సర్వే జరిగింది. సాధారణంగా ఒక వంతెన, రోడ్డు, కరెంట్ లైన్, టెలిఫోన్ లైన్ గానీ నిర్మించేటప్పుడు వ్యయ, ప్రయాసలను తగ్గించే తక్కువ దూరాన్ని ఎంపిక చేస్తుంటారు. అయితే విద్యుత్ లైను అలైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా దిశను మార్చుకుంది. మన్నేటికోట శివాలయం వద్ద మన్నేరు దాటి తూర్పునకు వచ్చింది. ఇక్కడి నుంచి ఈ లైన్ తూర్పుగా వెళ్లి, చిల్లా కాలువ సమీపంలో జాతీయ రహదారిని దాటి కరేడు పంచాయతీలోకి ప్రవేశిస్తోంది. శివాలయం సమీపంలో మన్నేరు నదిని దాటిన విద్యుత్ లైన్ మార్గాన్ని గ్రామానికి దక్షిణ దిశలో ప్రతిపాదించారు. అయితే ఈ విద్యుత్ లైను కోసం సర్వేయర్లు ప్రతిపాదించిన మార్గం 33 వ పోల్ దగ్గరికి వచ్చేసరికి దిశను మార్చుకుంది. ఉలవపాడు జాతీయ రహదారి, రైల్వే లైన్ చిల్లా కాలువ బ్రిడ్జికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో రైతు పొలం నుంచి నేరుగా అంటే తూర్పుగా చిల్లా కాలువ వైపు వెళ్లాల్సిన విద్యుత్ లైన్ను సర్వేయర్లు 90 డిగ్రీల కోణంలో ఉత్తర దిశకు మళ్లిస్తూ అలైన్మెంట్ మార్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అలైన్మెంట్ మార్చడంతో పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇవన్నీ కూడా బీసీ కులాలకు చెందిన చిన్న, సన్నకారు రైతుల భూములు. అధికారుల అక్రమాలతో భూములు ఈ లైను కింద పోతున్నాయి. పడమర నుంచి వచ్చే లైను నేరుగా తూర్పునకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, 33 వ పోల్ నుంచి ఉత్తర దిశ తీసుకొని మామిడి తోటలతో పాటు మరికొంతమందికి చెందిన మాగాణి మీదుగా కొంచెం దూరం వెళ్లి, అక్కడ ఇంకో వంకర తిరిగి దక్షిణ దిశగా కొంత దూరం వచ్చాక, అక్కడ ఇంకో వంకర తిరిగి తూర్పు వైపునకు వెళ్లేలా ప్రతిపాదించారు. 33 వ పోల్ నుంచి చిల్లా కాలువ వరకూ తక్కువ ఖర్చుతో, రైతులకు తక్కువ నష్టంతో విద్యుత్ లైన్ నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ, సర్వేయర్లు నిబంధనలు పాటించలేదు. 33వ పోల్ నుంచి హై టెన్షన్ విద్యుత్ లైన్ నేరుగా తీసుకెళ్తే లైను మూడు వంకర్లు తిరగాల్సిన పనిలేదని, పండ్ల తోటలకు నష్టం జరిగే అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ లైన్ నిర్మాణం విషయంలో ఏపీసీపీడీసీఎల్కు చెందిన ఒక ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన పొలాలు పోకుండా చేసేలా కార్యాచరణను భుజానకెత్తుకున్నట్లు తెలిసింది. ట్రాన్స్ కో అధికారుల వ్యవహారంలో సంబంధం లేకపోయినా సదరు ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
చీకటి ఒప్పందం!
రైతుల సమస్యలను పరిశీలిస్తున్నాం
హై టెన్షన్ విద్యుత్ లైనులో రైతులు కొంతమంది అభ్యంతరాలు చెప్పారు. సర్వే తిరిగి చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ లైను నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అయినా రైతుల అభ్యర్థన మేరకు లైనును పరిశీలిస్తాం. తమ సిబ్బందిని పంపించి మళ్లీ ఒకసారి పరిశీలన చేయిస్తా.
– కృష్ణారెడ్డి, ఈఈ, ట్రాన్స్కో, ఒంగోలు
పరిహారం పేరుతో బొక్కుడు
అధికార పార్టీ నాయకులు, డిస్కం అధికారులు కలిసి ట్రాన్స్ కో అధికారులతో కుమ్మకై ్క పంటలు లేకపోయినా ఉన్నట్లు చూపించి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్లే రూటులో ఉన్న పొలాల్లో ఉన్న రైతులతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని లేని పంటలను ఉన్నట్లు చూపించి పరిహారం పేరుతో తిలా పాపం...తలా పిడికెడు అన్న చందంగా దోచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10.50 కిలో మీటర్లలో కొంతమంది రైతులతో, పంటలు లేని వారిని గుర్తించి వారితో డిస్కం అధికారులు, అధికార పార్టీ నాయకులు వాటాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


