● సంతకాలు, వేలిముద్రలు లేకుండానే వేతనాల చెల్లింపు
● ఉపాధి సిబ్బందిపై పీడీ జోసఫ్కుమార్ మండిపాటు
● రూ.1.24 లక్షల జరిమానా
● రూ.57 వేల రికవరీ
మర్రిపూడి:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రజావేదిక నిర్వహించారు. ప్రజా వేదికకు డ్వామా పీడీ జోసఫ్కుమార్ హాజరయ్యారు. 2024–25 ఏడాదికి సంబంధించి మండలంలోని 21 పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులపై ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం విచారించి గ్రామసభలు నిర్వహించింది. ఉపాధి సిబ్బంది చేసిన అవకతవకలను గుర్తించి ప్రజావేదికలో బహిరంగంగా చదివి వినిపించారు. మండలంలోని అంకేపల్లిలో ఫారం ఫాండ్, రావెళ్లవారిపాలెంలో కమ్యూనిటీ ఫారంఫాండ్ పనులు చేయకుండా రూ.95 వేలు బిల్లులు డ్రా చేశారని సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. చిమటలో బొల్లా వెంకటేశ్వర్లు పనికి హాజరు కాకుండా వేతనాలు చెల్లించారు. శివయ్యకుంట పని చేయకుండా రూ.32 వేలు డ్రా చేశారని గుర్తించారు. చిమట–రామాయపాలెం రహదారికి ఇరువైపులా 400 మొక్కలు వేసినట్లు రికార్డుల్లో ఉందని, ఆ ప్రదేశంలో పరిశీలిస్తే 50 మొక్కలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. పన్నూరు, గుండ్లసముద్రం గ్రామాల్లో పనిచేయకుండా వేతనాలు చెల్లించినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. గార్లపేటలో చనిపోయిన వంగిపురం అబ్రహం ఖాతాలో రూ.402 ఎందుకు జమయ్యాయని, అవి వెంటనే తొలగించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు.
మర్రిపూడి, కెల్లంపల్లి, తంగెళ్ల గ్రామాల్లో కొలతల్లో తేడా వచ్చాయని, రెండు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకు నగదు జమైనట్లు సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. మండలంలో 522 పనులు చేయగా కూలి రూపంలో రూ.5,226345 చెల్లించారు. మెటీరియల్ రూపంలో రూ.28,51219 ఖర్చు చేశారు. పంచాయతీరాజ్లో 67 పనులకుగాను కూలీల వేతనాల రూపంలో రూ.23,370 చెల్లించారు. మెటీరియల్ రూపంలో రూ. 2,96,54,297 చెల్లించినట్లు పీడీ వివరించారు. మండలంలో జరిగిన పనుల గురించి రూ.1.24 లక్షల జరిమానా విధించామని, రూ.57 వేలు రికవరీ పెట్టినట్లు చెప్పారు. ఎంపీడీఓ ఎస్కే నాగూర్వలి, ఏపీఓ జి.రాంబాబు, ఏఓ విద్యాసాగర్రెడ్డి ఎస్ఆర్పీ, డీఆర్పీలు, ఫీల్ట్ అసిస్టెంట్లు ఉన్నారు.


