మార్కాపురం రూరల్: మండలంలోని బోడపాడులో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల్లో విజేతలకు శనివారం సాయంత్రం బహుమతులు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతిని సూర్యపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన ఏఎస్పీ సుంకి సురేంద్రరెడ్డి ఎడ్లజత 1584.5 అడుగులు లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు అందుకోగా మార్కాపురం జిల్లా బోడపాడు గ్రామానికి చెందిన లక్కు ఆంజనేయులు ఎడ్లజత 1527 అడుగులు లాగి రెండో స్థానంలో నిలిచి రూ.80 వేలు, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి ఎడ్ల జత 1492.3 అడుగులు లాగి 3వ స్థానంలో నిలిచి రూ.60 వేలు, 4వ స్థానంలో మార్కాపురం జిల్లా బొడిచర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రరెడ్డి ఎడ్ల జత 1238.5 అడుగులు లాగి రూ.40 వేలు, 5వ స్థానంలో కడప జిల్లా రుకావారిపల్లెకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్ ఎడ్ల జత నిలిచి రూ.30 వేలు, 6వ స్థానంలో మార్కాపురం జిల్లా వీరాయపాలెం గ్రామానికి చెందిన దూదేకుల చాంద్బాషా ఎడ్లజత నిలిచి రూ.20 వేలు, 7వ స్థానంలో నంద్యాల జిల్లా జిల్లెళ్ల గ్రామానికి చెందిన గుటిక హేత్విక్ రెడ్డి ఎడ్లజత నిలిచి రూ.10 వేలు గెలుపొందాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జత నిర్వాహకులకు రూ.5 వేలు చొప్పున అందజేశారు. పోటీలను వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఆసక్తిగా తిలకించారు.


