అబద్ధాలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబు ఐటీ వరం తిరునాళ్లలో ఎమ్మెల్యే తాటిపర్తి ధ్వజం
పుల్లలచెరువు: జాబ్ క్యాలెండర్ అంటూ మరోసారి నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ఐటీ వరం గ్రామంలో శనివారం రాత్రి వేణుగోపాల స్వామి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కేవలం వారి కార్యకర్తలు లాభపడడానికి మాత్రమే పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ను విడుదల చేస్తాం రాసి పెట్టుకోండి అని చెప్పిన మంత్రి లోకేష్ సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం కంటి తుడుపుగా నాలుగు ఉపాధ్యాయ పోస్టులు వేసి చేతులు దులుపుకుంటునారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని రూ.3 వేలు ఇస్తానని సంతకాలు చేసి బాండ్లు ఇచ్చారని ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా ఇంత వరకు ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఈ 22 నెలల్లో రూ.13 వేల కోట్లు నిరుద్యోగులకు ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, బియ్యం మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రఘు. సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల రవణారెడ్డి, మాజీ ఎంపీపీ లాజర్, నాయకులు చరణ్రెడ్డి, నాసర్రెడ్డి, గడ్డం సుబ్బయ్య, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


