మార్కాపురం టౌన్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్, కే మల్లిఖార్జునరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం సబ్కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ప్రతి ఆరు నెలలకు మంజూరు చేయాల్సిన కరువు భత్యాన్ని, రిటైర్డు అనంతరం రావాల్సిన బెనిఫిట్స్, సరెండర్ లీవులు సకాలంలో చెల్లించడం లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంత వరకూ చెల్లించలేదని, 12వ పీఆర్సీ సమయం రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు పీ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో 117 జీవోను రద్దుచేసినట్లుగా చెబుతున్న ప్రభుత్వం అదే విధమైన జీవో 19, 20 తీసుకువచ్చి ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఒకే పాఠశాలలో విద్య కొనసాగిస్తున్నారని, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నా నెల నెలా పదోన్నతులు నిలిపివేయడం వలన ఆ ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని, కేజీబీవీల్లో పనిచేస్తున్న వారికి ఎంటీఎస్ వర్తింపచేయాలని, కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించాలని, 50 ఏళ్లు నిండిన వారికి డిపార్టుమెంట్ పరీక్షలకు సంబంధం లేకుండా 24 ఏళ్ల స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ఎంఈఓల బదిలీలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సబ్కమిటీ సభ్యులు టీ సుబ్బరాయుడు, కే తిరుమల, టీ రామారావు పీసీ వెంకటేశ్వర్లు, జే ఆనందరావు, జీ రామకృష్ణ, రంగస్వామి, జే రాఘవేంద్రరావు, సీహెచ్ శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ నారాయణరెడ్డి, టీ శ్రీనివాసులు, యం కోటేశ్వరరావు, శోభన్బాబు, శ్రీనివాస నాయక్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


