● రూ.6 లక్షల ఆస్తి నష్టం
పొన్నలూరు: మండలంలోని కల్లూరివారిపాలెం గ్రామంలో కల్లూరి దిబ్బయ్య, మువ్వా శ్రీనివాస్రెడ్డి, జొన్నకూటి పెదచెన్నయ్య, అంబారపు వెంకటస్వామికి చెందిన ఉమ్మడి పొగాకు బ్యారన్ శనివారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం వలన సుమారు 1200 పొగాకు కర్రలు, బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో దాదాపుగా రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.


