టెన్నికాయిట్ జిల్లా జట్టు ఎంపిక
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో ఆదివారం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లాలోని పలు మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసినట్లు పీడీ శంకరరావు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 20, 21 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో సబ్ జూనియర్ కేటగిరీలో జరిగే పోటీలకు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. జిల్లా కార్యదర్శి ఎన్టీ ప్రసాద్, నామా చంద్రశేఖర్, నాగేశ్వరరావు, సురేష్, మౌలాలి పాల్గొన్నారు.
సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు హైస్కూల్లో ఈ నెల 18వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ అండర్ 14, అండర్ 17 ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాల బాలికల జట్టును ఎంపిక చేయనున్నట్టు జిల్లా కార్యదర్శులు సీహెచ్.వెంకటేశ్వర్లు, ఏ.శిరీష ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా పెన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, లీప్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రిపోర్టు చేయాలని తెలిపారు. వివరాలకు పీఈటీ డీ శ్రీనివాసరావు, సెల్:7989440879 ను సంప్రదించాలని వారు కోరారు.
బేస్తవారిపేట: బేస్తవారిపేట పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ప్రారంభించారు. అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించారు. రెండు రోజులుగా ప్రజాదర్బార్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని, సమస్యలు పరిష్కరించుకోవాలని విస్తృత ప్రచారం కల్పించారు. తీరా టీడీపీ కార్యాలయంలో కార్యక్రమం పెట్టారు. తహసీల్దార్ జితేంద్రకుమార్, ఎంపీడీఓ ఏవీ రంగనాయకులు, మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఉన్నాయని ఎలా లోపలికి రావాలని, మాకు సమస్యలు వస్తాయని ఎమ్మెల్యేకు తెలిపి కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుతిరిగారు. అధికారులు లేకుండానే టీడీపీ నాయకులను కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలపై అర్జీలను తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాల్సి ప్రజావేదికను టీడీపీ కార్యాలయంలో పెట్టడంపై అర్జీదారులు విస్మయం వ్యక్తం చేశారు.
పెద్దదోర్నాల: కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శ్రీశైలం వెళ్లే భక్తులతో మండల కేంద్రం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులతో వచ్చే పోయే వాహనాలతో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో భక్తులతో భారీగా రద్దీ ఏర్పడింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీగా తరలి వస్తుండటంతో ఆర్టీసీ సంస్థ జిల్లాలోని పలు డిపోల నుంచి ప్రత్యేకంగా శ్రీశైల పుణ్య క్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, గుంటూరు, కర్నూలు ప్రాంతాల నుంచి మహిళా భక్తులు కార్తీక మాసంలో తమ మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తుండటంతో రద్దీ ఏర్పడింది. ప్రయాణం గంట పాటు ఆలస్యంగా జరుగుతున్నట్లు వాహనదారులు పేర్కొంటున్నారు.
టెన్నికాయిట్ జిల్లా జట్టు ఎంపిక
టెన్నికాయిట్ జిల్లా జట్టు ఎంపిక


