
మోదీ పాలనలో తీవ్ర నిర్బంధం
● సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
ఒంగోలు టౌన్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశంలో తీవ్ర నిర్బంధం కొనసాగుతోందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ విమర్శించారు. ఎమర్జన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా ఎమర్జన్సీ నాడు–నేడు అనే అంశంపై స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అధ్యక్షత వహించగా, రాంభూపాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిని, మోదీని విమర్శించే వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేసి ఆరు నెలలకుపైగా బెయిల్ రాకుండా నిర్బందిస్తున్నారని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే దేశ ద్రోహం ముద్రలు వేసి దాడులు చేస్తున్నారని విమర్శించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభిర్, స్టాన్ స్వామి ఉదంతాలను ఉదాహరించారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడంతో పాటుగా రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమతాల సామరస్యానికి భిన్నంగా మత నియంతృత్వం కొనసాగాలని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలు స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో సీపీఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, వై.సిద్దయ్య, ఏవీ పుల్లారావు పాల్గొన్నారు.