గురుకుల ఘోష | - | Sakshi
Sakshi News home page

గురుకుల ఘోష

Jun 30 2025 3:53 AM | Updated on Jun 30 2025 3:53 AM

గురుకుల ఘోష

గురుకుల ఘోష

దర్శి(కురిచేడు): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా విద్యార్థులు భోజనం సక్రమంగా అందక గోడలు దూకి బయటకు వెళ్లి తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది దర్శి అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో పరిస్థితి. ఈ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పర్యవేక్షణ లేకపోవడంతో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. .

అమలు కాని మెనూ..

గురుకుల పాఠశాలలో మెనూ ఎప్పుడో మరిచిపోయారు. ఇష్టం వచ్చినట్లు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాల గోడలు దూకి బయటకు వెళ్లి తిని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 600 మంది విద్యార్థులకు కేవలం 12 లీటర్ల పాలనే వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారంలో రెండు రోజులు చికెన్‌ ఇవ్వాల్సి ఉండగా..నెలలో ఒకటి రెండు రోజు మాత్రమే తూతూమంత్రంగా పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 70 కిలోల వరకు చికెన్‌ తీసుకురావాల్సి ఉండగా 35 కిలోలు తీసుకువచ్చి సరిపెడుతున్నారు. రోజూ ఇవ్వాల్సిన గుడ్లను వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వండిన వంటలను రాత్రికి పెడుతున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు.

పట్టించుకునేదెవరు..?

గురుకుల పాఠశాల పర్యవేక్షణ కోసం పాఠశాల ఆవరణలోనే ప్రిన్సిపాల్‌ కోసం ఒక భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్‌ అందులోనే నివాసం ఉండి విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తి సింగరాయకొండలో నివాసముంటూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోతుండటంతో పాఠశాలలో ఏం జరుగుతుందో పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో విద్యార్థులు పాఠశాలను వీడి బయటకు వెళ్లిపోతున్నారు. పాఠశాల గేటు పక్కన ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఆటస్థలంలో విష సర్పాలు సంచరిస్తున్నా, పాఠశాల ఆవరణలోని కంపచెట్లను తొలగించి శుభ్రం చేయించకపోవడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల ప్రహరీ కూలినా మరమ్మతులు చేయకపోవడంతో రాత్రిళ్లు పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారుల కనీస పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలపై దృష్టి సారించి విద్యార్థుల ఇక్కట్లు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

దర్శి గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇక్కట్లు

మెనూ అమలు చేయకుండా పిల్లలను పస్తులు పెడుతున్న వైనం

600 మంది పిల్లలకు 12 లీటర్ల పాలు

ఆకలి తట్టుకోలేక గోడ దూకి బయటకు వెళుతున్న విద్యార్థులు

ప్రిన్సిపాల్‌ వైఖరిపై సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement