
జగనన్న పాలనలో మహిళలకే అగ్రపీఠం
యర్రగొండపాలెం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు అగ్రపీఠం వేశారని, వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో గౌరవించారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న ఉడుముల అరుణ శ్రీనివాసరెడ్డిని ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాల్లో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు. వారు ప్రతి విషయంలో చొరవచూపి ముందుకు కొనసాగుతుంటారని, అటువంటి మహిళలకు జగనన్న తన కేబినేట్లో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను సైతం ఎక్కువ భాగం మహిళలకే కేటాయించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా మహిళల పేరుతోనే మంజూరు చేసి వారి గౌరవాన్ని ఇతోధికంగా పెంచారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడా గౌరవం లేకుండా పోయిందని, కీచక పర్వం పెచ్చరిల్లి పోతుందని విమర్శించారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దాడులు ఎక్కువ అయ్యాయని, బాలికలను సైతం వదలకుండా అన్ని విధాలుగా వారిపై దాడులు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ రెడ్బుక్ అమలు అంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడన్నారు. ప్రస్తుత పాలనలో మహిళలు తమ గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై మహిళలు ఉద్యమించి పరిష్కరించుకోవాలని, అందుకు పార్టీతో పాటు తన అండదండలు ఉంటాయన్నారు. మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న అరుణమ్మ పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరుచుకునేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవటానికి మహిళలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి వర్గంలో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వంలో కీచక పర్వం
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్