నిరుద్యోగులకు శాపం | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు శాపం

Jun 30 2025 3:53 AM | Updated on Jun 30 2025 3:53 AM

నిరుద

నిరుద్యోగులకు శాపం

కూటమి పాపం..

ఒంగోలు వన్‌టౌన్‌: నిరుద్యోగులను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో మభ్యపెట్టారు. తమకు ఓట్లేసి గెలిపిస్తే భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అప్పటి వరకూ నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. నమ్మి ఓట్లేసిన వారిని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, నిరుద్యోగ భృతి చెల్లించకపోగా, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారందరినీ తొలగించారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో వేల మందిని నిరుద్యోగులుగా మార్చారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మొత్తం ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతోనే సాగడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది.

సూపర్‌ 6.. నిరుద్యోగ భృతికి మంగళం...

ఎన్నికల సమయంలో సూపర్‌ 6 పథకాల గురించి కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాటిలో ఒకటైన నిరుద్యోగ భృతి పథకం కింద ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పారు. అధికారం చేపట్టగానే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఏడాది దాటినా నిరుద్యోగ భృతి గురించి సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నాయకులెవరూ మాట్లాడటం లేదు. ఏడాది నుంచి ఎదురుచూసిన నిరుద్యోగులు ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనంటూ పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరంతా నిరుద్యోగ భృతి కోసం ఏడాది నుంచి ఎదురుచూశారు. ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు.

వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు...

కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేకపోగా, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊడబీకింది. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పి వారందరినీ పూర్తిగా తొలగించి ఉపాధి లేకుండా చేసింది. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేసింది. రేషన్‌ షాపుల్లోనే బియ్యం, సరుకులు విధానం ద్వారా ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల పొట్టకొట్టింది. చివరకు పారిశుధ్య కార్మికులు, ఫ్యామిలీ ఫిజీషయన్లు, రేషన్‌ డీలర్లపై సైతం కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ ఉన్న ఉద్యోగాలు తొలగించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియమించిన వారిని తొలగించాలనే కుట్రలతో పాటు కూటమి పార్టీల శ్రేణులకు దోచిపెట్టాలనే దురుద్దేశంతో అన్ని వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తోంది. రాజకీయ కారణాలతో అవకాశం ఉన్న ప్రతి శాఖలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను తీసివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.

అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నిరుద్యోగులతో చంద్రబాబు చెలగాటం

ఈసారీ అదే తీరు

ఏడాది పాలనలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా కల్పించని ప్రభుత్వం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా తొలగింపు

నిరుద్యోగ భృతి పేరుతో నిలువునా మోసం

జిల్లాలో 5 లక్షల మందికిపైగా బాధితులు

2014–19లోనూ జాబు రావాలంటే బాబు రావాలంటూ మోసం...

సీఎం చంద్రబాబునాయుడు 2014–19లోనూ నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల ఇదేవిధంగా వ్యవహరించారు. ఆనాడు కూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున హామీలిచ్చారు. 600కుపైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నిరుద్యోగులను, ప్రజలను దారుణంగా మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చేంత వరకూ రూ.2 వేల నిరుద్యోగ భృతి అని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీశారు. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు 2019 ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నిరుద్యోగులతో చంద్రబాబు మరోసారి చలగాటమాడారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా మోసం చేస్తున్నారు.

నిరుద్యోగులంతా ఆందోళనలో ఉన్నారు

సీఎం చంద్రబాబు గతంలో కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 2014–19 పాలనలో నిరుద్యోగ భృతిగా రూ.2 వేలు చెల్లిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అతి కొద్దిమందికి మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్లీ పట్టించుకోవడం లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏడాది పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా కల్పించలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు చేయలేని అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు.

– ఎండీ ఇమ్రాన్‌ఖాన్‌, కార్పొరేటర్‌, ఒంగోలు

నిరుద్యోగులకు శాపం1
1/2

నిరుద్యోగులకు శాపం

నిరుద్యోగులకు శాపం2
2/2

నిరుద్యోగులకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement