మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం

Jun 30 2025 3:53 AM | Updated on Jun 30 2025 3:53 AM

మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం

మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం

ఒంగోలు టౌన్‌: మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని, ఇది కార్మిక హక్కులపై దాడి చేయడమేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అన్నారు. జూలై 9వ తేదీ దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఆదివారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ లేబర్‌ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని సాధించేందుకు సమ్మెలు చేసే అవకాశాన్ని కోల్పోతారని చెప్పారు. యూనియన్లు పెట్టుకునే హక్కుతో పాటు సమ్మె హక్కులను కూడా కోల్పోతారన్నారు. ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజుల వేతనాన్ని కట్‌ చేయడం లాంటి క్రూర నిబంధనలను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 8 గంటల పనిదినానికి తూట్లు పొడుస్తూ 10 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఓటీని 140 గంటలకు పెంచడం కార్మికుల మీద పాలకులు చేస్తున్న దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవైపు కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ మాట్లాడుతూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు గత నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా పనిభారాన్ని పెంచుతున్నారని విమర్శించారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ఉద్యోగ భద్రత కల్పించకుండా స్కీం వర్కర్లచే పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నారని వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థి, యువజనులు లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎంఎస్‌ సాయి, వెంకటరావు, శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, పారా శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement