కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

కష్టాలు!

Jun 30 2025 7:24 AM | Updated on Jun 30 2025 7:24 AM

కష్టా

కష్టాలు!

ట్రాన్స్‌ఫార్మర్‌

పశ్చిమ ప్రాంతంలో పొలంలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఓల్టేజి హెచ్చుతగ్గుల వల్ల కానీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందా... ఇక వినియోగదారులకు అవస్థలు ప్రారంభమైనట్లే. చిన్న ఈదురుగాలులు కొడితేనే కాలిపోవడం సర్వసాధారణమైంది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు అర్బన్‌ ప్రాంతాల్లో అయితే 12 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చాలి. అప్పుడే రైతులు వంటలు దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ రవాణా ఖర్చు కూడా విద్యుత్‌ శాఖ భరించాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తున్న దాఖలాల్లేవు. పైగా రవాణా ఖర్చులను కూడా రైతులపైనే వేస్తున్నారు. డిపార్టుమెంట్‌ వాహనంలోనే తరలిస్తూ వేలాది రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే కొత్తది మార్చేందుకు ఐదారు రోజులు పడుతోంది. పట్టణాల్లో అయితే మూడు రోజులకు తక్కువ పట్టడం లేదు.

వ్యవసాయ విద్యుత్‌ అస్తవ్యస్తం...

వ్యవసాయ విద్యుత్‌ అస్తవ్యస్తంగా ఉంది. త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇచ్చినట్లే ఇచ్చి తరచూ నిలిపేస్తున్నారు. ఇలా నిలిపేస్తుండటంతో 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండటం లేదు. తొమ్మిది గంటలు ఇస్తున్నామని చెబుతున్నా రెండు, మూడుసార్లు నిలిపేస్తుండటంతో రైతులు అవస్థ పడుతున్నారు. గృహాలకు ఇచ్చే విద్యుత్‌కు కూడా ప్రతిరోజూ గంటల తరబడి అనధికార కోతలు విధిస్తున్నారు. గాలులు వీచినా, వర్షాలు కురుస్తాయనుకున్న సమయంలో విద్యుత్‌ కోతలు మరింత అధికం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆఫీసులకు ఫోన్‌ చేసి విసిగిపోవాల్సిందే. ఒక వైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్‌ కోతలు పగలూ రాత్రీ తేడా లేకుండా ఉండటంతో జనం ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్‌ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్‌ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.

విద్యుత్‌ వినియోగం ఇలా...

జిల్లాలో రోజువారీ విద్యుత్‌ వినియోగ లక్ష్యం 8.150 మిలియన్‌ యూనిట్లు.. అయితే ఇచ్చిన లక్ష్యం కంటే తక్కువగానే కాలుతోంది. జూన్‌ నెల 22వ తేదీ 7.700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. జూన్‌ నెల 23వ తేదీ 7.791 మిలియన్‌ యూనిట్లు మాత్రమే వినియోగించారు. కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్‌ వినియోగం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఐదారు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోనే ప్రతి రోజూ రెండు, మూడు గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారంటే విద్యుత్‌ శాఖ గాడి తప్పిందనే చెప్పాలి. అధికారుల చేతిలో ఏమీ లేదు. పైనుంచి ఏవిధమైన ఆదేశాలు వస్తే ఆ విధంగా చేయాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులు లేరు.

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే గగనమే మార్పిడి భారం వినియోగదారులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఐదారు రోజులకు పైగానే పడుతున్న వైనం పట్టణ ప్రాంతాల్లో కూడా మూడు రోజులు దాటాల్సిందే అడ్డగోలుగా అనధికారిక కోతలు వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా కాక అవస్థలు

స్మార్ట్‌ షాక్‌...

వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్న సమయంలో స్మార్ట్‌ మీటర్లను చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగులకొట్టాలని పిలువునిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవే స్మార్ట్‌ మీటర్లు బిగించటం ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంస్థలకు స్మార్ట్‌ మీటర్లు బిగించటం పూర్తి కావస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లాలో 16,109 స్మార్ట్‌ మీటర్లు బిగించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,961 మీటర్లు బిగించారు. కమర్షియల్‌ స్మార్ట్‌ మీటర్లు జిల్లా వ్యాప్తంగా 84,751 బిగించాలని లక్ష్యంకాగా ఇప్పటి వరకు 70,208 బిగించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు ‘‘అమృత్‌’’ మంచినీటి పథకాలు ఎక్కడైతే మంజూరు చేశారో ఆయా నగరాలు, పట్టణాల్లో కూడా స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒంగోలు నగరంలో కూడా స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు.

సమస్యలుంటే మా దృష్టికి తెండి

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ఒకటి, రెండు రోజుల్లో మారుస్తున్నాం. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. రెండు, మూడు నెలల గ్యాప్‌ తరువాత రైతులు వ్యవసాయ మోటార్లు స్టార్ట్‌ చేస్తున్నారు. కొంత గ్యాప్‌ తరువాత మోటార్లు వేసినప్పుడు సహజంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతాయి. అందుకే దాదాపు 500 ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్లు చేసి సిద్ధంగా ఉంచాం. రైతులకు కానీ, పట్టణాల్లో కానీ వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వటానికి ఎలాంటి సమస్యలు లేవు. అలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్‌ సిబ్బంది ఇబ్బందులు పెట్టినా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు.

– కట్టా వెంకటేశ్వర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, ఏపీసీపీడీసీఎల్‌

కష్టాలు!1
1/2

కష్టాలు!

కష్టాలు!2
2/2

కష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement