
అడ్డగోలు కోతలపై జనాగ్రహం
సింగరాయకొండ: మండల కేంద్రంలో పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో ఆగ్రహించిన బాలయోగినగర్, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యుత్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావటం లేదన్నారు. చిన్న గాలివాన వచ్చినా విద్యుత్ నిలిపేస్తున్నారని ఆరోపించారు. అసలే వాతావరణ ప్రభావంతో ఎండతీవ్రత బాగా ఉందని, రాత్రి అయినా వేడి తగ్గటం లేదని, మరో పక్క విద్యుత్ సక్రమంగా ఉండకపోవటంతో ఎలా బతకాలని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి తరచూ విద్యుత్కు అంతరాయం కలుగుతోందని, ఇప్పుడు రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్కు అధికారులను నిలదీద్దామని వచ్చామని, ఇక్కడ సిబ్బంది ఎవరూ లేరని విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావుకు ఫోన్ చేస్తే జాతీయ రహదారిపై లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో విద్యుత్ తీగలు తెగాయని మరమ్మతు చేస్తున్నామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య ఉంటే ఇప్పుడు తీరిగ్గా రాత్రి పూట మరమ్మతులు చేయటం ఏమిటని, దీనిని బట్టి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆరోపించారు. విద్యుత్ అధికారుల వైఖరికి నిరసనగా సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో గ్రామస్తుల నిరసన