
రైతు కంట కన్నీటి ఝరి..
తిరస్కరణలతో సరి..
కనిగిరిరూరల్: కూటమి పాలనలో పొగాకు రైతులు కుదేలయ్యారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కంపెనీల ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో పొగాకు సాగు విస్తీర్ణం 4,952 హెక్టార్లు ఉండగా.. 5 క్లస్టర్ల పరిధిలో 74 గ్రామాల్లో 1,245 బ్యార్నీలు ఉన్నాయి. ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి 8.5 మిలియన్ కేజీలు వచ్చింది. కనిగిరి టుబాకో బోర్డులో మార్చి 19 నుంచి పొగాకు వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇప్పటికి పది రౌండ్లు వేలం అయినా కేవలం 3.18 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రతి బ్యార్నీ నుంచి 12 బేళ్ల వరకు అనుమతి ఉన్నా ఇప్పటి వరకు నాలుగు, ఐదుసార్లు వేలానికి వెళ్లిన పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కేవలం గ్రేడ్1 (ఎఫ్1,ఎఫ్2,ఎఫ్3) రకాల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి.. మిగతా రకం బేళ్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిసారి వేలం కేంద్రానికి వెళ్లడం ఒకటి రెండు బేళ్లు మాత్రమే కొనుగోలు జరగడంతో.. మిగతా వాటిని తీసుకుని ఉసూరుమంటూ తిరిగి ఇంటికి వెళ్లే దుస్థితి ఏర్పడింది. గత ఏడాది కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో 7.58 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. దాదాపు రైతు దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని బోర్డు అధికారులు, ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వంలో గరిష్ట ధర కేజీ రూ.350 నుంచి రూ.360 వరకు, కనిష్ట ధర రూ.280 నుంచి రూ.270 వరకు కొనుగోలు చేశారు.
కనిష్ట ధర దిగజారినా..
కనిగిరి బోర్డులో ఈఏడాది ప్రారంభ వేలంలో కేజీ పొగాకు కనిష్ట ధర రూ.180 వరకు పలికినా..వారం రోజులుగా కనిష్ట ధర కేజీ రూ.150కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గరిష్ట ధర రూ.280 మాత్రమే ఉంది. అంతేగాక మీడియం, లోగ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోతుండటంతో ఇళ్లల్లో పేరుకుపోయిన పొగాకు బేళ్లను చూసుకుంటూ తెచ్చిన పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో పొగాకు రైతు లోలోన కుములుతున్నాడు.
బయ్యర్లతో అధికారుల కుమ్మక్కు?
కనిగిరి టుబాకో బోర్డు అధికారులు, బయ్యర్ల తీరును నిరసిస్తూ ఇప్పటికి అనేక దఫాలు రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బయ్యర్లతో ఆక్షన్ సూపరింటెండెంట్ కుమ్మక్కయి రైతులను అన్యాయం చేస్తున్నాడని, వారికి నచ్చిన రైతులకు న్యాయం చేసి.. మిగతా వారికి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం పామూరు మండలం వెంకట్రావుపాలెంకు చెందిన పెద్ద రైతు .. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు అన్యాయం చేయవద్దని అడిగినందుకు తాగి వచ్చావా..? అంటూ ఆక్షన్ సూపరింటెండెంట్ దురుసు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రైతులు నిరసన తెలిపారు. ఆర్ఎంకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, కంపెనీలు, అధికారులు అందరూ కలిసి పొగాకు రైతును పూర్తిగా అన్యాయం చేస్తున్నారని రైతు సంఘ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. భారీ ఎత్తున బేళ్లు తిరస్కరిస్తుండటం, కనిష్ట ధరలు నానాటికీ దిగజారడాన్ని నిరశిస్తూ సోమవారం కూడా మరోమారు ధర్నా చేపట్టనున్నట్లు రైతు సంఘ నాయకులు తెలిపారు.
కనిగిరి బోర్డు పరిధిలో 8.5 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి పది రౌండ్లు పూర్తవుతున్నా 3.18 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు దిగజారిన కనిష్ట ధరలు ఇళ్లలో నుంచి కదలని బేళ్లు స్పందించని అధికారులు, బయ్యర్లు నేడు వేలం కేంద్రం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న రైతులు
పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ ఏడాది రైతులకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను విస్మరించడంతో బయ్యర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేక.. బేళ్లన్నీ అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నారు. నామ్కే వాస్తే ఒకటి రెండు బేళ్లను మీడియంను కొనుగోలు చేసి.. సరాసరి ధర రూ.240 అంటూ బోర్డు అధికారులు ప్రకటిస్తున్నారు. దీని వల్ల పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
– సూరసాని మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి
పొగాకు రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతు పండించిన పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. రైతు తెచ్చిన పొగాకు బేళ్లన్నీ కొనుగోలు చేయాలి. లోగ్రేడ్ పొగాకును నోబిడ్ పేరుతో తిరస్కరించడం సరైంది కాదు. అధికారులు బయ్యర్లతో కుమ్మకై ్క రైతులకు అన్యాయం చేస్తున్నారు. పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కల్పించాలి.
– గుజ్జుల బాలిరెడ్డి, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు

రైతు కంట కన్నీటి ఝరి..

రైతు కంట కన్నీటి ఝరి..

రైతు కంట కన్నీటి ఝరి..

రైతు కంట కన్నీటి ఝరి..