
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి
● యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు
ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని యూటీఎఫ్ శ్రేణులకు యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఒంగోలులో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో నాణ్యమైన, సమానమైన విద్య అందాలంటే ప్రభుత్వ విద్యావిధానం బలపడాలన్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే 3వ పోస్టు ఇవ్వాలని, 2 సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుడు ఒకేచోట పనిచేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలు అదనంగా పనిచేసి పాఠశాలలను సమాజానికి దగ్గరకు చేర్చాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరినీ బోధనేతర పనులు తగ్గించి ఎన్రోల్మెంట్ పెంచే వాతావరణాన్ని కల్పించాలన్నారు. జిల్లాలో రిలీవర్ లేక చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని బదిలీ, ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయులందరినీ కొత్త స్థానాల్లో పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు రవి, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కోశాధికారి చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజసులోచన, తదితరులు పాల్గొన్నారు.