
అన్ని గ్రేడులు కొనుగోలు చేయాలి
● పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు
టంగుటూరు: పొగాకు కంపెనీ ప్రతినిధులు వేలం కేంద్రానికి వచ్చిన అన్ని పొగాకు గ్రేడులను కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వైస్ చైర్మన్ బోడుపాటి బ్రహ్మయ్య అన్నారు. పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వైస్ చైర్మన్ బోడుపాటి బ్రహ్మయ్య శుక్రవారం టంగుటూరు వేలం కేంద్రాన్ని సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు రైతులతో మాట్లాడుతూ రైతులంతా మండెలలో మగ్గిన పొగాకునే బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలని తెలిపారు. అలాగే మార్కెట్ కి అనుగుణంగా బేళ్లు తీసుకురావాలని సూచించారు. బేళ్లు అమ్మకానికి తెచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ దృష్ట్యా తెలపరి పొగాకు, నీళ్లు కట్టిన పొగాకును తీసుకురావొద్దని తెలిపారు. కొన్ని కంపెనీ వాళ్లు కొనుగోలు చేసిన బేళ్లలో అన్య పదార్థాలు ఉన్నందున కస్టమర్స్ వాటిని తిరస్కరించారని తెలిపారు. రైతులందరూ తమ బేళ్లలో ఎటువంటి పొగాకేతర అన్యపదార్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. కంపెనీ కొనుగోలుదారులకు అన్ని రకాల గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలన్నారు.