
వైఎస్సార్ సీపీ హింసా రాజకీయాలను సమర్ధించదు
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: వైఎస్సార్ సీపీ హింసా రాజకీయాలను సమర్ధించదు, ప్రోత్సహించదని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంటే మరో పక్క టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండ, పోలీసుల అండ చూసుకుని ఇంకా రెచ్చిపోతూ ఆ పార్టీ కార్యకర్తల కక్ష్యపూరిత చర్యలకు బాధపడి, కడుపుమండి ఎవరో ఫ్లెక్సీలో పెట్టిన సినిమా డైలాగును వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చిలువలు పలువలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకులు హింసను ప్రేరేపించేలా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమా డైలాగులు పెడితేనే ఈ విధంగా రాద్దాంతం చేస్తుంటే సాక్షాత్తు టీడీపీ నాయకులు అవినీతి సొమ్ము పంపిణీ లావాదేవీల్లో చెలరేగిన గొడవల్లో ఇటీవల ఒంగోలు లో జరిగిన ఘటనలో టీడీపీ నాయకుడిని 60కి పైగా కత్తిపోట్లు పొడిచారని ..ఈ రపరప.. ఘటనను ఏమంటారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఏనాడూ హింసను ప్రోత్సహించలేదని, శాంతి భద్రతలను పార్టీ పరిరక్షించిందని గుర్తు చేశారు. హింసకు ఎప్పుడూ పార్టీ దూరంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం హింసను విడనాడి శాంతిని పరిరక్షించాలని హితవు పలికారు.