
ఈవీఎం గోడౌన్లో పటిష్ట భద్రత
● మామిడిపాలెంలోని గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు ఉంచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఈవీఎం గోడౌన్ను శుక్రవారం స్టేట్ ఎలక్షన్ డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం యంత్రాలు బీయూలు, సీయూ, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, వివిధ పార్టీల నేతలు వెంకటరావు, గుర్రం సత్యం, మాకినేని అమర్ సింహ, ఎస్కే రసూల్, రాజశేఖరరెడ్డి, ఉపేంద్ర, నవీన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రేపు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
ఒంగోలు సిటీ: డీఎస్సీ 1998, డీఎస్సీ 2008 లకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎంటీఎస్) ఈ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఉపాధ్యాయులందరూ కౌన్సెలింగ్ కు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
అమ్మ మందలించిందని..
ఉరేసుకుని బాలిక మృతి
యర్రగొండపాలెం: మండలంలోని పాత గోళ్లవిడిపి గ్రామంలోని ఎస్సీ పాలెంలో బాలిక ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పి.చౌడయ్య కథనం ప్రకారం.. 8వ తరగతి వరకు చదువుకున్న బరిగెల శైలమ్మ(16) రెండేళ్ల క్రితం స్కూల్కు వెళ్లడం మానేసింది. పాఠశాలకు వెళ్లినట్లయితే తన అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ అయ్యేవని, ఇప్పుడైనా బడికి వెళ్లి చదువుకోమని ఆ బాలికను తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శైలమ్మ ఇంట్లో ఎవరూలేని సమయంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్కు తన చున్నీతోనే ఉరివేసుకుంది. తన సోదరి మరణానికి గల కారణాలు తెలుసుకున్న అన్న ఎలిషాబాబు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ సీహెచ్ ప్రభాకరరావు పరిశీలించారు.

ఈవీఎం గోడౌన్లో పటిష్ట భద్రత