‘పని’కిరాని వాళ్లకు హాజరు | - | Sakshi
Sakshi News home page

‘పని’కిరాని వాళ్లకు హాజరు

Jun 21 2025 2:56 AM | Updated on Jun 21 2025 3:45 AM

‘పని’కిరాని వాళ్లకు హాజరు

‘పని’కిరాని వాళ్లకు హాజరు

బేస్తవారిపేట:

‘ఉపాధి హామీ పథకాన్ని అవినీతిమయంగా మార్చేశారు. మేము శుక్రవారం పని చేసినా హాజరు వేయలేదు’ అంటూ కూలీలు పని ప్రదేశం నుంచి నేరుగా వచ్చి అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బేస్తవారిపేట ఏపీఓ కార్యాలయం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని ఒందుట్లకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఓ గురువరకుమార్‌, టీఏ పి.పీరారెడ్డి వద్దకు చేరుకుని సీనియర్‌ మేట్‌ తీరుపై విరుచుకుపడ్డారు. సీనియర్‌ మేట్‌ ప్రతి రోజూ పనిచేసే కూలీలకు అన్యాయం చేస్తూ, పనికి రాని వారికి మాత్రం హాజరు వేస్తున్నాడని ఆరోపించారు. ఈ నెలలో రోజూ పనికి వెళ్లినప్పటికీ వారం రోజులు హాజరు వేయలేదన్నారు. కొందరికి ఆరు రోజులు పనికి వెళ్తే ఐదు రోజులుగా చూపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ప్రాంతంలో ఉండే లక్కాకుల శ్రీనివాసులు, సూరం గురువారెడ్డి, ఆకుకూరలు అమ్ముకునే సూరం రాజశేఖరరెడ్డి, 80 ఏళ్ల వృద్ధులు తోట బుడ్డయ్య, గోవిందమ్మ ఇలా అనేక మందికి దొంగ హాజరు వేస్తున్నాడని ఆరోపించారు. రోజూ కష్టపడి పనిచేసే తమకు తక్కువ కూలి పడుతోందన్నారు. ఒక వర్గానికి చెందిన వారు పనిచేయకుండా హాజరు సమయానికి, ఫొటోలు దిగేందుకు వస్తున్నారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశంలో కాకుండా ఇంటి దగ్గర సంతకాలు పెట్టించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 10 గంటలకు పని అయిపోయినప్పటికీ ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ‘కొందరికి మాత్రమే పని డిమాండ్‌ పెడతాను, మీ దిక్కున్నవారికి చెప్పుకోండి. నాకు ఎమ్మెల్యే అండ ఉంది, కలెక్టర్‌, అధికారులు నన్ను ఏమీ చేసుకోలేర’ని దబాయిస్తూ బూతులు తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్‌ మేట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కూలీలు అర్జీ అందజేశారు. న్యాయం చేయకపోతే సోమవారం నుంచి ఏపీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఇంటి వద్ద సంతకాలు తీసుకోవడమేంటి?

మేట్‌ మాయాజాలంపై ఉపాధి హామీ కూలీల ఆగ్రహం

బేస్తవారిపేటలో ఏపీఓ, టీఏను

నిలదీసిన ఒందుట్ల వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement